వైసీపీ గూటికి మేడా మల్లికార్జునరెడ్డి

– జగన్‌ సమక్షంలో చేరిక
హైదరాబాద్‌, జనవరి31(జ‌నంసాక్షి) : రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గురువారం వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జరిగిన ఈకార్యక్రమంలో జగన్‌ మేడాకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఆయన అనుచరులు, నాలుగు మండలాల నాయకులు కూడా పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు. రాజంపేట నుంచి వచ్చిన మేడా అనుచరులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్‌ మేడా మల్లిఖార్జున రెడ్డి గత మంగళవారం వైఎస్‌ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీలో
ఇమడలేకపోతున్నానని,  వైసీపీలో చేరుతానని ఆయన వైఎస్‌ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయనకు వైఎస్‌ జగన్‌ సూచించారు. తమ పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. దీంతో జగన్‌ సూచనలతో మేడా గురువారం వైసీపీలో చేరారు.