శ్రావణ్‌కు టికెట్‌ ఇవ్వొద్దు!

– రాజధానిలో వ్యతిరేఖ వర్గీయుల ఆందోళన
– అడ్డుకున్న శ్రావణ్‌ వర్గీయులు
– ఇరు వర్గాల మధ్య తోపులాట
అమరావతి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తాడికొండ టీడీపీ టికెట్‌ను ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌కు ఇవ్వద్దని అతని వ్యతిరేఖ వర్గీయులు మంగళవారం ఆందోళనకు దిగారు. శ్రావణ్‌ వ్యతిరేక వర్గీయులంతా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రాజధానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రావణ్‌ కుమార్‌ను వ్యతిరేకిస్తూ వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఆయన వ్యతిరేక వర్గం పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో వెంకటపాలెం చేరుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గం పాదయాత్రను అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. కాగా గత కొంతకాలంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి పెరిగిపోతోంది. దీనిని నివారించేందుకు ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది.
రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్‌ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వారు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. ఎలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.