షూ పాలిష్‌ చేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి

భోపాల్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 230 నియోజకవర్గాలకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా రాష్టీయ్ర ఆమ్‌జాన్‌ పార్టీకి చెందిన శరద్‌ సింగ్‌ కుమార్‌ వినూత్న ప్రచారానికి తెర తీశాడు. తనకు ఈసీ షూ సింబల్‌ ఇచ్చిందట. దీంతో ఓటర్లను ఆకర్షించడానికి, తన గుర్తుకు సూచికగా ఓటర్ల షూను పాలిష్‌ చేశాడు. షూ సింబల్‌ తీసుకోవడానికి ఏ పార్టీ కానీ.. ఏ అభ్యర్థి కానీ ముందుకు రాలేదు. కానీ.. మేం దాన్ని తీసుకున్నాం. అదే మాకు ఆశీస్సులు ఇచ్చేలా మార్చుకుంటాం.. అంటూ శరద్‌ సింగ్‌ తెలిపాడు. అయితే.. ఇలా వినూత్న ప్రచారానికి తెర తీసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. తెలంగాణలోని కోరుట్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఆకుల హనుమంతు అనే అభ్యర్థి ఓటర్లందరికీ చెప్పులు పంపిణీ చేశాడు. ఆ ఎన్నికల్లో తనను గెలిపించాలని.. గెలిచిన తర్వాత హావిూలు నెరవేర్చకపోతే తనను అదే చెప్పుతో కొట్టాలని తెలిపాడు.