సమస్యలు పరిష్కరించకపోతే… 

జులై నుంచి సమ్మె
– తెలంగాణ రేష  డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్‌
హన్మకొండ, జూన్‌ 22(జ‌నం సాక్షి ) : రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించని పక్షంలో జులై నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్‌ అన్నారు. కనీస గౌరవ వేతనం ప్రకటించాలని కోరుతూ రేషన్‌ డీలర్లు శుక్రవారం హన్మకొండలో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్‌గార్డెన్‌ ప్రాంతంలో షాపుల వద్దకు వెళ్లి బిక్షాటన చేశారు. సమస్యల పరిష్కారం కోసం తాము ఎన్నిసార్లు అందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గౌరవ వేతనం ప్రకటించి తమకు రావాల్సిన పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని బత్తుల రమేష్‌ బాబు డిమాండు చేశారు. డీడీలు తీసేందుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించని పక్షంలో అందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.