‘సహకార’ విజేతలకు సీఎం అభినందన


హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో వారిని పరిచయం చేసుకొని ఎన్నికల్లో విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికోసం ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను పకడ్బందీగా వారికి చేర్చాలని సూచించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి దీటుగా సమాధానమివ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారికి తేనీటి విందు ఇచ్చారు. ఆప్కాబ్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్ల అభ్యర్థుల గురించి వారితో చర్చించారు. అన్ని జిల్లాల అభిప్రాయాలను సీఎం సావదానంగా విన్నారు. పార్టీ సూచించిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తూ రైతులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.