సిద్దిపేట జిల్లాలో విషాదం

` నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు
సిద్దిపేట(జనంసాక్షి):సరదాగా, ఆనందంతో పండగ జరుపుకోవాల్సిన సమయంలో తీవ్ర విషాదం నింపింది. బతుకమ్మ పండగ 9 తొమ్మిది రోజుల పాటు ఆడి చెరువులో వేయడం ఆనవాయితీ. అయితే అందులో భాగంగానే ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌ పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన తెలిసిన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని స్థానికులు సాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అయితే చెరువులోకి దిగినది బాబు, భారతి, యాదమ్మగా గుర్తించారు. అందులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. యాదమ్మ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆమే మృతదేహం కూడా లభ్యమైంది. దీంతో ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరోవైపు తీగుల్‌ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసుల యత్నించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. అయితే వారికి పోలీసులు ఎంత నచ్చజెప్పిన వినడం లేదు. దీంతో గ్రామంలో ఉద్రిక్తంగా మారింది.