సిద్దూపై మండిపడ్డ బిజెపి

మేయర్‌కు అవమానంపై క్షమాపణలకు డిమాండ్‌

భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళా మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధును బిజెపి డిమాండ్‌ చేసింది. బిజెపి మహిళా కార్యకర్తలు ఇండోర్‌లోని రాజ్వాడా ప్యాలెస్‌లో సవిూపంలోని దేవి అహల్యా విగ్రహం ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సిద్ధు మాట్లాడుతూ నష్టపరిహారం చెల్లించకుండా నగరంలో ప్రజల ఇళ్లను కూల్చివేసిన మేయర్‌ మాలినీ లక్ష్మణ్‌సింగ్‌ గౌర్‌ను టెలివిజన్‌లోని ఒక కామెడీ కార్యక్రమానికి సంబంధించిన ప్రముఖ పల్లవిని అనుకరిస్తూ ‘చప్పట్లు కొట్టండి’ అంటూ అనుచితంగా వ్యాఖ్యానించినట్లు బిజెపి విమర్శిస్తోంది. మునిసిపాలిటీ అధికారులను, మేయర్‌ను ‘చప్పట్లు కొట్టండి అలాగే మేయర్‌ను కొట్టండి’ అంటూ వ్యాఖ్యానించారని, దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.