సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ ను నియమించండి

– కేంద్రానికి సిఫార్సు చేసిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియామకం లాంఛనమైంది. తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్ర అక్టోబరు 2న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజే అంటే అక్టోబరు 3న జస్టిస్‌ గొగొయ్‌ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణంగా సుప్రీంకోర్టులో తన తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని తన వారసుడిగా సీజేఐ సిఫార్సు చేస్తుంటారు. ఈ సంప్రదాయం ప్రకారమే తదుపరి సీజేఐ పేరు సిఫార్సు చేయాల్సిందిగా ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖ జస్టిస్‌ మిశ్రకు లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన జస్టిస్‌ మిశ్ర.. జస్టిస్‌ గొగొయ్‌ పేరును ప్రతిపాదిస్తూ న్యాయశాఖకు ప్రతిలేఖ రాశారు. దీంతో జస్టిస్‌ గొగొయ్‌ నియామకం ఇక లాంఛనప్రాయమైంది. జస్టిస్‌ గొగొయ్‌ వచ్చే ఏడాది నవంబరు17 వరకు సీజేఐ పదవిలో కొనసాగుతారు. జస్టిస్‌ గొగొయ్‌ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌లో చేరారు. 2001 ఫిబ్రవరి 28న గువహాటి హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబరులో పంజాబ్‌, హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరిలో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012 ఏప్రిల్‌లో పదోన్నతి పొందారు.కాగా..సుప్రీంకోర్టులో మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ విధానాన్ని ఎత్తిచూపుతూ ఈ ఏడాది జనవరిలో నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. వీరిలో జస్టిస్‌ గొగొయ్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘జాతీయ పౌర జాబితా(ఎన్‌ఆర్‌సీ)’ అంశంపై విచారణ జరుపుతున్నారు.
—————————-