సుప్రీంకోర్టు జడ్జిలుగా.. దినేష్‌, ఖన్నాల ప్రమాణస్వీకారం

 

– 28కి చేరిన సుప్రింకోర్టు జడ్జీల సంఖ్య

న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ ఆధ్వర్యంలో కోర్టు నంబరు 1లో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఖన్నా, దినేష్‌లతో కలిసి సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 28కి చేరింది. సుప్రీంలో మొత్తం 31 మంది జడ్జిలు ఉండొచ్చు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేయగా, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేశారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను కేంద్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆయన విషయంలో సీనియార్టినీ పాటించలేదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు మాజీ న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజోగ్‌, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మేనన్‌లు సీనియర్లు అయినప్పటికీ, వారిని కాదని జస్టిస్‌ ఖన్నాను నియమించారంటూ అసంతృప్తి వ్యక్తమయింది.