సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక హోటల్లో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు మహిళలు సహా 12 మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం రావడంతో మహిళా పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులే సమాచారం ఇచ్చారని మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి జ్యోతి శర్మ తెలిపారు. దాంతో తాము వలపన్ని, 8 మంది పురుషులు, నలుగురు మహిళలను పట్టుకున్నామని, అంతా స్థానికులేనని చెప్పారు. అమిత్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కలిసి కస్టమర్ల అవసరాల మేరకు అమ్మాయిలను సరఫరా చేస్తారని నిందితులలో ఒకరు విచారణలో వెల్లడించారు.

ఈ హోటల్ యజమాని మహేష్ పండిట్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు. దాన్ని అతడు సంతోష్ ఠాకూర్ అనే వ్యక్తికి నెలకు రూ. 1.20 లక్షలకు అద్దెకిచ్చాడు. అమ్మాయిల కోసం వస్తున్న కస్టమర్లలో 20 నుంచి 60 ఏళ్ల వరకు వయసున్న వాళ్లు ఉంటున్నారని జ్యోతి శర్మ చెప్పారు. మద్యం సీసాలు, పది మొబైల్ ఫోన్లతో పాటు హోటల్ రిజిస్టర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మహిళలకు వలవేసి, వారికి పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపించి ఈ వృత్తిలోకి దించుతున్నారని, అలా రాకెట్‌ను విస్తృతం చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.