సెల్‌ఫోన్‌ లాక్కున్నందుకు ఆత్మహత్య

నాగ్‌పూర్‌లో బాలుడి విషాదాంతం

నాగ్‌పూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఇటీవలి కాలంలో చిన్నచిన్న విషయాలకే చిన్నారులతో పాటు యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ సమయం ఫోన్‌తో గడుపుతున్న బాలుడి వద్ద నుంచి అతని తల్లి ఫోన్‌ లాక్కోవడంతో 14ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వీడియో గేమ్‌లకు బానిసగా మారాడని భావించిన తల్లి అతని దగ్గరున్న స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవడంతో క్షణికావేశంలో బాలుడు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహల్‌ ప్రాంతంలో క్రిష్‌ సునీల్‌ లునావత్‌.. తల్లి, అక్కతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ప్రతిరోజు మొబైల్‌ ఫోన్‌లో వీడియో గేమ్స్‌ ఆడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండేవాడు. ఏడాది నుంచి అతడు పాఠశాలకు కూడా వెళ్లట్లేదని కొత్వాలి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమేశ్‌ పేర్కొన్నారు. క్రిష్‌ తల్లితో పాటు అక్క ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తుండగా.. బాలుడు మాత్రం ఎక్కువగా ఇంట్లో ఉండేందుకు ఇష్టపడేవాడని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. ఇటీవల కొత్త ప్లేస్టేషన్‌ గేమింగ్‌ డివైస్‌ను కొనివ్వాలని తల్లిని బలవంతం చేశాడు. సోమవారం క్రిష్‌ తల్లి ముంబయికి వెళ్లాల్సి రావడంతో మొబైల్‌ ఫోన్‌ తనకు ఇవ్వాలని అడిగింది. అతను ఫోన్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో బలవంతంగా అతడి నుంచి లాక్కొని మధ్యాహ్నం ముంబయి బయలుదేరి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన క్రిష్‌ ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌ సాయంతో ఉరివేసుకొని ఆత్మహత్య

చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. బాలుడి అక్క సాయంత్రం తిరిగి ఇంటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.