సొంత ఆవుతో వెళుతున్న వ్యక్తిపై దాడి

ఫిర్యాదుతో నలుగురు అరెస్ట్‌

లక్నో,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): 70 ఏళ్ల వృద్ధుడు తన ఆవును చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా.. దాన్ని దొంగిలించాడనే నెపంతో.. గో రక్షకులు ఆ పెద్దమనిషిని చితకబాది గుండు గీయించారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నంద్‌పూర్‌ గ్రామంలో ఆగస్టు 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కైలాష్‌ నాథ్‌ శుక్లా(70) అనే వ్యక్తి.. తన ఆవుకు అస్వస్థత కావడంతో.. చికిత్స నిమిత్తం నంద్‌పూర్‌ గ్రామం విూదుగా పశువుల దవఖానాకు తీసుకెళ్తున్నాడు. కైలాష్‌ ఆవును దొంగిలిస్తున్నాడని భావించిన ఆ గ్రామస్తులు అతడిని అడ్డుకొని తీవ్రంగా చితకబాది, గుండు గీయించారు. ఆ తర్వాత ముఖానికి నల్లటి రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనపై బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వృద్ధుడిని కొట్టిన ఘటనపై విచారణ జరపాలని పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

—————-