హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం వద్దు

హైకోర్టులో పిటీషన్‌ దాఖలు
కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):
హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనానికి అనుమతి ఇవ్వద్దంటూ వేసిన ఒక పిటిషన్‌ను సోమవారం హైకోర్టు స్వీకరించింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయా లంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డితో సహా పర్యావరణ నియంత్రణ మండలికి, జీహెచ్‌ఎంసీకి నగర పోలీస ్‌కమిషనర్‌తో పాటు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ జంట నగరాలలోని దాదాపు 46వేల విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు హుస్సేన్‌సాగర్‌ నిండిపోయి చారిత్రక ఒక జలాశయం అంతరించిపోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ హైకోర్టు ఎదుట వాదన వినిపించారు. కేవలం పర్యావరణం సమస్యే కాకుండా భూగర్భ జలం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని పటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.