హైడ్రా కూల్చివేతలు సమర్థనీయమే


పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి
విూడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. హైదరాబాద్‌లో విూడియాతో నారాయణ మాట్లాడారు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. అందుకే అరగంటపాటు వర్షం కురిస్తే నగరం ముంపునకు గురయ్యే పరిస్థితి వస్తోంది. హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చుతున్నారు. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పులివిూద స్వారీ చేస్తున్నారు. ఆయన పులి విూద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదం ఉంది. చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ శక్తులు కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నారాయణ డిమాండ్‌ చేశారు.భాజపాయేతర రాష్టాల్రపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనినారాయణ అన్నారు. దేశంలో ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. అదానీకి సెబీ దాసోహమైందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్‌ చేశారు.