హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం
` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ ప్రతినిధులు
` నగరాన్ని ప్రపంచ టెక్నాలజీ పవర్‌ హౌస్‌ గా తీర్చిదిద్దుతాం
` మైక్రోసాఫ్ట్‌ విస్తరణతో యువతకు మరిన్ని అవకాశాలు
` సాంకేతికరంగంలో వారు సత్తాచాటాలి
` అడ్వాంటేజ్‌ తెలంగాణ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు కార్యచరణ
` తద్వారా 50వేల మందికి విద్యార్థులకు పరిపూర్ణమైన శిక్షణ లభించే అవకాశం
` రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యధిక ప్రమాణాలతో నిర్మించిన మైక్రోసాఫ్ట్‌ నూతన కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్‌ ఐటీ సంస్థకు మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ అధునాతన మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో 2 వేల 500 మంది ఉద్యోగులు ఒకేసారి విధులను నిర్వర్తించడానికి అవకాశం కలుగుతుంది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా సరికొత్త ఏ ఐ సెంటర్‌ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని,15 వేలకోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ సిటీలో ఏఐ సెంటర్‌ ను ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ లో శిక్షణను పొందడానికి మూడు సరికొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్‌ సంస్థ చేపట్టనుందని తెలిపారు. అడ్వాంటేజ్‌ తెలంగాణ కార్యక్రమంకింద రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఫౌండేషన్స్‌ అకాడెమి కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందని, దీని ద్వారా 50వేల మందికి విద్యార్థులకు పరిపూర్ణమైన శిక్షణ లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు తదితరులు అభిప్రాయపడ్డారు. ఏ ఐ ఇండస్ట్రీ ప్రో పేరుతో మరొక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా రాష్ట్రమంతటా 20వేల మంది పరిశ్రమ నిపుణులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని వారు వివరించారు. ఏఐ ` సిఒఇ నీ ఏర్పాటు చేసి ఏఐ`గవర్న్‌ ఇనిషియేటివ్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ప్రోడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో అధునాతనమైన శిక్షణను ఇవ్వడానికి ఆస్కారం లభిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అభివృద్ధితోపాటు రాష్ట్రంలో హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్లలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తామని ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు రాబోయే సంవత్సరాలలో వీటికి అదనంగా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను దశలవారీగా పెట్టనున్నట్లు వారు వివరించారు. భవిష్యత్తంతా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వైపు ప్రయాణిస్తున్న సందర్భంలో హైదరాబాదులో మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ ను ఏర్పాటుచేయటం అందరికీ గర్వకారణమని, ఇది హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ పటంపై మరింత సగర్భంగా నిలబడేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి తదితరులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్‌ అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వాలిదాసు జగదీశ్వర్‌ గౌడ్‌, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.