హైవే రెయిలింగ్‌ను ఢీకొన్న కారు

మహిళ,చిన్నారి మృతి..
ఏలూరు,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు హైవే రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాది చిన్నారి మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. విశాఖ నుంచి కృష్ణా జిల్లా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఇనుప రేకులు కారులోకి చొచ్చుకెళ్లాయి. ఈ ఘటనలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి అయిన శ్రీనివాస్‌ గాయపడగా.. ఆయన భార్య అన్నపూర్ణ (49), మనవడు ఆరుష్‌ (1) మృతిచెందారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.