హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నాయ‌కుడు పై ఎఫ్ఐఆర్ న‌మోదు

బెంగ‌ళూరు : హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిజాబ్‌ను వ్య‌తిరేకించే వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని ఖాన్ హెచ్చ‌రించాడు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క పోలీసులు ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురాగిలో నిర్వ‌హించిన ఓ స‌మావేశానికి ముఖ‌రం ఖాన్ హాజ‌రై ప్ర‌సంగించారు. హిజాబ్‌ను వ్య‌తిరేకిస్తే ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాను. ఇక్క‌డే పుట్టాం.. ఇక్క‌డే చ‌చ్చిపోతాం.. జీవితం ఉన్నంత వ‌ర‌కు ఇండియ‌న్‌గానే బ‌త‌కాలి. ఎవ‌రైతే హిజాబ్‌ను వ్య‌తిరేకిస్తున్నారో వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాను. ఏదో ఒక రోజు మ‌నమంతా చ‌నిపోయేవాళ్ల‌మే. ఇంత దానికి మ‌తాల‌ను అంట‌గ‌ట్ట‌డం స‌రికాదు. అన్ని కులాలు, మ‌తాలను స‌మానంగా చూడాలి. మీరు ఏదైనా ధ‌రించొచ్చు. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా అడ్డ‌గిస్తే.. ఊరుకునే స‌మ‌స్య లేద‌ని, ఇలాంటి చ‌ర్య‌ల‌ను స‌హించ‌బోమ‌ని ముఖ‌రం ఖాన్ స్ప‌ష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఈ వ్యాఖ్య‌ల‌పై క‌ర్ణాట‌క పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.