ప్రజాస్వామ్య భారతాన నవశకం.. మహిళా బిల్లుకు మోక్షం లభిస్తే ఏపీ, తెలంగాణలో మగువలకు దక్కే సీట్లు ఎన్ని..?

భారత పార్లమెంటరీ చరిత్రలో ఇవాళ బిగ్‌డే!. ప్రజాస్వామ్య భారతాన నవశకం మొదలుకాబోతోంది!. ఆకాశంలో సగం, అన్నింటా సగమని గౌరవించుకునే మహిళా లోకానికి పెద్దపీట వేయబోతోంది పార్లమెంట్‌. ఐదు దశాబ్దాలుగా పెండింగ్‌ పడుతూ వస్తోన్న మహిళా బిల్లుకు ఇవాళ మోక్షం లభించబోతోంది!. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం.మరికాసేపట్లోనే లోక్‌సభలో దీనిపై చర్చ జరగనుంది. సుమారు 7గంటలపాటు సుదీర్ఘంగా సాగనుంది ఈ చర్చ. దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మహిళా బిల్లు ఆమోదం లాంఛనం కాబోతోంది.

మహిళా బిల్లులో ఏముంది?.

అసలు, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో ఏముంది?. ఎలాంటి అంశాలను బిల్లులో పెట్టింది? ఏమేం సవరణలు ప్రతిపాదించింది.

  • మహిళా బిల్లు కోసం 108, 128 రాజ్యాంగ సవరణలు చేయబోతోంది
  • ఆర్టికల్‌ 330A, ఆర్టికల్‌ 334Aలో కూడా మార్పులు చేయనున్నారు
  • రొటేషన్‌ పద్ధతిలో రిజర్వ్‌డ్‌ సీట్లు కేటాయింపు ఉంటుంది, అంటే ఒకసారి మహిళలకు కేటాయించిన సీటు ఆ తర్వాత మారిపోతుంది.
  • నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయ్‌, అంటే 2029 ఎన్నికల్లోనే ఇంప్లిమెంట్‌ కావొచ్చు
  • బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత 15 ఏళ్లపాటు మహిళా కోటా అమలవుతుంది
  • అయితే, రాజ్యసభ, శాసనమండలిలో మహిళా రిజర్వేషన్‌ వర్తించదు
  • పార్లమెంట్‌ ఆమోదించినా.. రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి, కనీసం 14 రాష్ట్రాలు ఆమోదిస్తేనే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయ్‌!

50ఏళ్ల క్రితమే తెరపైకి వచ్చిన మహిళా రిజర్వేషన్ల డిమాండ్.. ఎప్పుడేం జరిగింది?

మహిళా రిజర్వేషన్ల డిమాండ్ ఇప్పటిది కాదు, దాదాపు 50ఏళ్ల క్రితం ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. మహిళా రిజర్వేషన్ల కోసం అసలు తొలి అడుగు ఎప్పుడు పడింది? ఈ 50ఏళ్లలో ఏమేం జరిగాయో ఇప్పుడు చూద్దాం

  • 1974లో మహిళా రిజర్వేషన్ల కోసం తొలి అడుగు పడింది, అప్పుడే ఓ కమిటీ వేసింది అప్పటి ప్రభుత్వం
  • ఆ తర్వాత 1993లో 73, 74 రాజ్యంగ సవరణలుచేసి పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించారు
  • అయితే, 1996లో మొదటిసారి పార్లమెంట్‌ ముందుకు మహిళా బిల్లు వచ్చింది
  • 1996లో ఆ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు
  • 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలో రెండోసారి పార్లమెంట్‌ ముందుకొచ్చింది మహిళా బిల్లు
  • 1998లో బిల్లు ఆమోదం పొందకపోవడంతో 1999లో మూడోసారి ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం
  • 2002లో బిల్లు ఆమోదానికి ఎన్డీఏ సర్కార్‌ విఫలయత్నం చేసింది, కానీ ఆమోదం పొందలేదు
  • 2004 ఎన్నికల టైమ్‌లో మహిళా బిల్లుపై యూపీఏ హామీ ఇచ్చింది
  • ఆ తర్వాత 2005లో మహిళా బిల్లుకు ఎన్డీఏ కూడా మద్దతు ప్రకటించింది
  • 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం… రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టింది
  • 2009లో ఉభయ సభల ముందుకు బిల్లు వచ్చింది
  • అయితే, 2010లో రాజ్యసభలో మాత్రమే ఆమోదం పొందింది
  • ఈలోపే ఎన్నికలు రావడం, 2014లో లోక్‌సభ రద్దుతో బిల్లు మురిగిపోయింది
  • మళ్లీ ఇప్పుడు మరోసారి పార్లమెంట్‌ ముందుకొచ్చింది మహిళా బిల్లు, ఈ సెప్టెంబర్‌ 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే కాకుండా, ఆ తర్వాతి రోజే అంటే సెప్టెంబర్‌ 19న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది, ఇవాళ ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగబోతోంది.

మహిళా బిల్లు అమల్లోకొస్తే 33శాతం కోటా కింద ఎన్ని సీట్లు వస్తాయ్‌?. ఎస్సీఎస్టీలకు ఎన్ని సీట్లు దక్కుతాయ్‌. ఓబీసీల పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 సీట్లు, ఈ లెక్కన 33శాతం మహిళా కోటా అంటే 181 సీట్లు వస్తాయ్‌, ఇందులో ఎస్సీ ఎస్టీలకు 43 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ 43 సీట్లలో ఎస్సీలకు 28 సీట్లు, ఎస్టీలకు 15 సీట్లు వస్తాయ్‌. ఇక జనరల్‌ మహిళా కోటా కింద 138 సీట్లు ఉండబోతున్నాయ్‌. అయితే, ఓబీసీ కోటా ఇవ్వాలనే డిమాండ్‌… విపక్షాల నుంచి వినిపిస్తోన్న డిమాండ్‌.

ఏపీలో 33శాతం కోటా ఎంత?..

మహిళా కోటా అమలైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సీట్లు దక్కుతాయ్‌? ఎంపీ సీట్లలో ఎన్ని వస్తాయ్‌? అసెంబ్లీ స్థానాల్లో కోటా ఎంత ఉంటుంది?

  • ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయ్‌, ఇందులో 33శాతం కోటా కింద మహిళలకు 8 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది
  • అలాగే, 175 అసెంబ్లీ స్థానాల్లో 58 సీట్లు మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది.

తెలంగాణలో 33శాతం కోటా ఎంత?

తెలంగాణలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయో చూద్దాం!

  • తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయ్‌, ఇందులో 5 నుంచి 6 సీట్లు మహిళా కోటా కింద వెళ్లనున్నాయ్‌
  • అలాగే, 119 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.