త్వరలోనే ఆ రుణాలు కూడా మాఫీ.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్!

మోడీ అవకాశం వస్తే తెలంగాణ పై విషం చిమ్ముతారని, తెలంగాణ-ఎపి విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని మోడీ చెప్పారు అని గుర్తుచేశారు మంత్రి హరీష్ రావు. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారని, మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారని మండిపడ్డారు. బిజెపివి అన్ని అబద్ధాలేనని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై విష ప్రచారాలు మానుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు.కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదని, ఆ పార్టీ 6 గ్యారెంటీలు ఏమో కాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం 6 నెలలకు ఓ సీఎం వస్తారు అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో కర్ఫ్యూ వస్తుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ హైకమాండ్ బెంగళూరులో తయారైందని, కాంగ్రెస్ వాళ్లు వస్తే రెండో రాజధాని బెంగళూరు అవుతుందని, ఢిల్లీకి కాంగ్రెస్ వాళ్లు క్యూ కడతారన్నారు.కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని మండిపడ్డారు. వాళ్లకు ఎంత సేపూ కేసీఆర్ ని తిట్టుడే తప్పా వేరే పని లేదని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావద్దన్నారు మంత్రి హరీష్ రావు. మరో వైపు లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తాం అన్నారు. కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరారు అని, ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ అన్నాడు.. అది ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్ అయ్యిందని గుర్తు చేశారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ అన్నారు కానీ అక్కడ ఉన్న బస్సులు కూడా నడుస్తలేవన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కుక్క తోక పట్టి చెరువు ఈదినట్టే అని, కాంగ్రెస్ వాళ్లు చెవిలో పువ్వులో పెడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే మాట తప్పని పార్టీ.. మడమ తిప్పని పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు.