50వేల కోట్ల పన్నుల ఎగవేత

కేంద్ర పరోక్ష పన్నుల విభాగం గుర్తింపు

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): గడచిన ఏదాడిన్నర కాలంలో ఇండియాలో రూ.50 వేల కోట్లకు పైగా పన్నును ఎగవేశారని కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సిబిఐసి) గుర్తించింది. ఈ మొత్తంలో పది శాతం జీఎస్టీ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. సిబిఐసి పర్యవేక్షణలో పనిచేస్తున్న డిజిజిఐ (జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2017-18 మధ్య 604 జీఎస్టీ ఎగవేత కేసులు నమోదయ్యాయని, రూ.4,441 కోట్ల మొత్తం కేంద్రానికి రావాల్సి ఉందని పేర్కొంది. ఇక సర్వీస్‌ టాక్స్‌ (సేవా పన్ను) ఎగవేతల విలువ రూ.39,047 కోట్లయితే, కేంద్ర ఎక్సైజ్‌ సుంకాల ఎగవేత రూ. 6,621 కోట్లుగా ఉందని వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి రాక ముందు పన్ను ఎగవేతలు చాలా ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం పన్ను వసూళ్ల రేటు పుంజుకుందని, పన్ను ఎగవేతల్లో 57 శాతం రికవరీని కూడా సాధించామని తెలిపింది. ఇదే సమయంలో ఈ సంవత్సరం నమోదైన పాతకేసుల్లో మాత్రం రికవరీ రేటు కేవలం 9 శాతమేనని తెలియజేసింది.