618 మంది ఫోన్లను ట్యాప్‌ చేశారు

` గుర్తించిన సిట్‌
` ఈ విషయమై ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌పై ప్రశ్నల వర్షం
` ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా సుదీర్ఘంగా విచారించిన అధికారులు
హైదరాబాద్‌(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ బృందం నాలుగో సారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 8 గంటలుగా ఆయన్ను సిట్‌ అధికారులు విచారించారు. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌తో పాటు అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, మరికొందరు రాజకీయ నేతలు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్‌రావును పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ లోతుగా ప్రశ్నించారు. 618 మంది ఫోన్లను ప్రభాకర్‌రావు బృందం ట్యాప్‌ చేసినట్టు ఇప్పటికే సిట్‌ గుర్తించింది. బాధితులను పిలిపించి వారి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్టు సమాచారం. మరో వైపు నిన్న ప్రణీత్‌రావును కూడా సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు అతని వాంగ్మూలం ఆధారంగా కూడా ప్రభాకర్‌రావును విచారించినట్టు తెలుస్తోంది. ప్రణీత్‌రావుకు ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాలేంటి? ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్‌ చేయాలని చెప్పారు, ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్‌ వ్యవహారం మొత్తం కొనసాగింది? అనే కోణాల్లో విచారణ సాగింది.

తాజావార్తలు