ప్రారంభమైన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. కోర్ కమిటీ సాయంత్రం 5.30 గంటలకు భేటీ కావల్సి ఉన్న ముందుగానే సమావేశమైంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో భేటీ జరుగుతుంది. సోనియాతో పాటు ఈ సమావేశానికి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోని పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా కొత్తగా నియమితులైన దిగ్విజయ్సింగ్, నిన్న మొన్నటి వరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన గులాంనబీ ఆజాద్లు కూడా హాజరయ్యారు.
అలాగే రోడ్మ్యాప్లతో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఈ భేటీకి ప్రత్యేకంగా హాజరు అయ్యారు. ఈ రోడ్ మ్యాపుల రూపకల్పన విషయంలోనూ కేవలం పార్టీ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకుని రూపొందించాలని ముగ్గురు నేతలకు సూచించడం తెలిసిందే. ఈ ముగ్గురి నివేదిక కూడా ఆ దిశగానే ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రధాని నివాసానికి చేరుకోగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కలిసి ఒకే నివాసంలో అక్కడకు చేరుకున్నారు.