అమరుల ఆశయాల సాధన దిశగా సర్కారు అడుగులు

` అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలుపుతాం
` తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
` సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తాం
` తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు
హైదరాబాద్‌(జనంసాక్షి):జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక వృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతిన బూనారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో.. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.

5న కేబినెట్‌ భేటీ
` పలు కీలక అంశాలను చర్చించాలని నిర్ణయం
` దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్‌ యువ వికాసం అర్హులను ప్రకటన
` మంత్రివర్గసమావేశంలో చర్చించాకే రాజీవ్‌ యువ వికాసంపై తుది నిర్ణయం
` కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
` రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైనా సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష
` పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి,సీతక్క, దామోదర రాజనర్సింహ
` ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్‌కు సీఎం అభినందనలు
హైదరాబాద్‌(జనంసాక్షి):బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపైనా సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, సీఎస్‌ పాల్గొన్నారు. ఈనెల 5న క్యాబినెట్‌ భేటీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దరఖాస్తుల పూర్తి పరిశీలన తర్వాతే రాజీవ్‌ యువ వికాసం అర్హులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో చర్చించిన తర్వాతే రాజీవ్‌ యువ వికాసంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడదని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు ఇప్పటికే నివేదిక అందింది. నివేదికను సీఎం, మంత్రులకు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి సీఎం, మంత్రులు అభినందనలు తెలిపారు.