ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం

తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మాఫియా పెట్రేగి పోతోంది. వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుక‌ను త‌వ్వి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వ‌ర‌కు ఇసుక‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తూ అందిన‌కాడికి దోచుకుంటున్నారు. ఇసుక మాఫియాపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.ఇందిర‌మ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పాలనలో శాండ్ మాఫియాకు అభయ హస్తంగా మారింద‌న్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. బడా ఛోటా తేడా లేదు..మంత్రుల నుంచి మండల స్థాయి లీడర్ల దాకా ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.అధికారులకు మామూళ్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంటే.. ఇక అడ్డగోలు తవ్వకాలను.. అక్రమ రవాణాను అడ్డుకునేవాడెవ్వడు..? నదులను.. వాగులను.. వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్ల జేబుల్లో నింపుకుంటున్నారు..! అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతున్నద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.