రైతు పోరాటాలకు మద్దతుగా నిలవడం జర్నలిస్టులకు సామాజిక బాధ్యత

 

 

 

– ఇథనాల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం తప్పెట్లా అవుతుంది?
– సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
– జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : అల్లం నారాయణ
– మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది : దేవులపల్లి అమర్‌
– అరెస్టులకు వ్యతిరేకంగా పౌరసమాజం కూడా స్పందించాలి : కె శ్రీనివాస్‌
– ప్రజాస్వామ్యం`పత్రికాస్వేచ్ఛ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌ బ్యూరో, జూన్‌ 14 (జనంసాక్షి)
ప్రజాపోరాటాలకు మద్దతుగా నిలుస్తున్న జర్నలిస్టులపై ఇటీవల అనేక కేసులు పెడుతున్నారని, మీడియా సంస్థలపై ఒత్తిళ్లు, అణిచివేతలు కొనసాగుతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజల ఉద్యమాలకు మద్దతుగా నిలవడం జర్నలిస్టుల సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ధోరణులకు వ్యతిరేకంగా పాత్రికేయులు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం- పత్రికాస్వేచ్ఛ’ అంశంపై శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సీనియర్‌ జర్నలిస్టు దిలీప్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపెట్టేలా వ్యవహరిస్తున్నాయని, అప్రజాస్వామిక అరెస్టులకు పూనుకుంటున్నాయని తెలిపారు. ఇటీవల కొమ్మినేని అరెస్ట్‌, రహమాన్‌పై కేసుల విషయంలో ఈ విషయం స్పష్టం రూఢీ అవుతోందన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా జర్నలిస్టులంతా ముక్తకంఠం వినిపించాలనే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు వేణుగోపాల్‌ నాయుడు, ఉపాధ్యక్షులు కే.శ్రీకాంత్‌రావు, ట్రెజరర్‌ రాజేష్‌, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దధన్వాడ విషయంలో పోరాడకుంటే తప్పు : అల్లం నారాయణ, ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌

పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడకుంటే తప్పు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ రైతులకు మద్దతుగా నిలిచినందుకు ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. గతంలోనూ పత్రికా స్వేచ్ఛను హరించేలా పాలకులు ప్రవర్తించారు. ప్రజల పక్షం వహించే జర్నలిస్టుల మీద ఉద్దేశపూర్వకంగా టార్గెట్‌ చేయడం ఏ పాలకులకైనా తగదు. కొమ్మినేని విషయంలో అటు ఆంధ్రప్రదేశ్‌ సర్కారు కూడా అన్యాయంగా అరెస్టు చేయించింది. ఇది అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించినట్టు లెక్క. ప్రతిపక్ష పార్టీల మీద కక్ష ఉంటే వారితో ఢీకొనాలి తప్ప ఇలా జర్నలిస్టులను టార్గెట్‌ చేయడం సబబు కాదు. దీనిమీద జర్నలిస్టులందరూ సామూహికంగా గొంతెత్తాలి. ఇలాంటి దుశ్చర్యలు రిపీట్‌ కాకుండా చూసుకోవాలి.

పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వేర్వేరు కాదు : దేవులపల్లి అమర్‌, సీనియర్‌ సంపాదకులు

కొమ్మునేని శ్రీనివాసరావుపై పెట్టిన కేసు జర్నలిస్టులకు పాలకులు ఇచ్చిన ఒక సంకేతం. ఎంతటివారినైనా ఉపేక్షించబోమనే సందేశం దానివెనుకాల ఉంది. జర్నలిజంలోకి కొత్తగా వస్తున్న యువతరాన్ని ఈ రకమైన కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడియా స్వతంత్రంగా లేదు. రాజకీయపార్టీల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం రెండు వేరు వేరు కాదు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ భాగం. తెలంగాణలో కూడా పెద్దధన్వాడ విషయంలో వార్తలు ప్రచురించినందుకు జనంసాక్షి పత్రిక ఎడిటర్‌ ఎంఎం రహమాన్‌పై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమైన విషయం. దీనిని ప్రతి ఒక్కరూ ఖండిరచాలి.

ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్ట్‌ చేస్తామనే సంకేతాలు : కే.శ్రీనివాస్‌, సీనియర్‌ సంపాదకులు

కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్ట్‌ చేస్తామనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం ఖండిరచాల్సిన విషయం. గతంలో కేసీఆర్‌ పాలనలో ఏం జరిగిందో మనందరం చూశాం. ప్రస్తుతం రేవంత్‌ పాలన కూడా అంతకు తక్కువేం లేదు. మిత్రుడు ఎంఎం రహమాన్‌ మీద కేసు పెట్టడం అన్యాయమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండిరచాలి. మీడియా కూడా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారడం వల్ల ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మీడియా మీద దాడులు డౌర్జన్యాలు చేస్తున్నారు. పార్టీలకు తొత్తులుగా లేకుండా మీడియా మనగలిగే రోజు రావాలి. ఇంత కాలం సోషల్‌ మీడియాకు సంబంధించిన వారి విషయంలో రాజ్యం కేసులు పెట్టినప్పుడు అందరం లైట్‌ తీసుకున్నాం. ఇప్పుడు ప్రధాన మీడియా వరకు వచ్చింది. సమాచారాన్ని చేరవేసే అందరూ జర్నలిస్టులేనన్న విషయాన్ని ఇప్పటికైనా మనం అంగీకరించాలి. రహమాన్‌ మీద పెట్టిన కేసు విషయంలో పౌరసమాజం కూడా స్పందించాలి.

కొమ్మినేని అరెస్టుతోనే అసలు ఉద్దేశం బహిర్గతం : కే.రామచంద్రమూర్తి, సీనియర్‌ సంపాదకులు

సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో ఉన్న వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన వివాదాస్పదంగా మాట్లాడే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని సంబంధం లేకుండా ప్రభుత్వం అరెస్టు చేయడం… కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. మరోవైపు సాక్షి మీడియా కార్యాలయాలపైనా దాడికి ప్రభుత్వం ప్రోత్సహించినట్లుగా ఉంది. దాడులను అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ మాట్లడనీయకుండా… బెదిరింపులకు గురిచేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే.

జర్నలిస్టుల పరిస్థితి ఆందోళనకరం : శైలేష్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌

ప్రజాస్వామ్యం మీడియా అవిభక్త కవలలు. కవల పిల్లలకు అవయవాలు వేర్వేరుగా ఉంటాయి. రూపం మాత్రం ఒక్కతీరుగానే ఉంటుంది. మీడియా ప్రజాస్వామ్యానికి గుండెకాయ మాత్రం ఒక్కటిగా ఉంది. పత్రికా స్వేచ్ఛను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాలి. వ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నలోనే ఉంటున్నాయి. పోలీసులు, పబ్లిక్‌ ప్రాసెక్యూటర్లు, న్యాయస్థానాలు ఇలా అన్నీ ప్రభుత్వ ఆదీనంలో ఉండేవే. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాధిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్‌ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిని చూస్తుంటే జర్నలిస్టులకు రానున్నవన్నీ గడ్డు రోజులని కనిపిస్తోంది. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌పై పెట్టిన కేసు చాలా అన్యాయంగా ఉంది. దీనిని జర్నలిస్టులు ప్రజాస్వామికవాదులు ఖండిరచాలి. రాజ్యాంగంలోని 19(ఏ)లో పేర్కొన్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి.

కేసులకు భయపడం.. ఇకముందు కూడా ప్రజాగొంతు వినిపిస్తాం : ఎంఎం రహమాన్‌, జనంసాక్షి ఎడిటర్‌

ఇథనాల్‌ ఫ్యాక్టరీ విషయంలో రైతుల తరపున నిలబడ్డందుకు నాపై కేసులు పెట్టారు. పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైనదని రైతులను చైతన్యం చేసినందుకు ప్రజాందోళన పెల్లుబికింది. ఫ్యాక్టరీ యాజమాన్యం కక్షగట్టి తప్పుడు ఫిర్యాదులు చేసింది. మూడున్నర దశాబ్దాల నా జర్నలిస్టు వృత్తిలో ఇది నాపై మొదటి కేసు. అయినా వార్తలు రాయడంలో వెనక్కి తగ్గేది లేదు. కేసులకు భయపడేది లేదు. ఇకముందు కూడా ప్రజల గొంతుకగా జనంసాక్షి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

ప్రమాదంలో మీడియా : టంకశాల అశోక్‌, సీనియర్‌ సంపాదకులు

ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడిరది. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టం అవుతుంది. ప్రస్తుతం ప్రతిక స్వేచ్ఛనే కాదు… అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారు. వీటిని అధిగమించేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజల మద్దతును కూడగట్టుకుని.. ప్రజల సహకారంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

అనుకూల వార్తలు కోరుకుంటున్నారు : ధనుంజయ రెడ్డి, సంపాదకులు, సాక్షి

గతంలో ప్రభుత్వాలు వ్యతిరేక వార్తల పట్ల కొంత అసంతృప్తి చూపేవి. కానీ ఇప్పుడు అసహనం నుంచి కక్షసాధింపు వరకు వచ్చింది. ప్రభుత్వాలు పూర్తిగా అనుకూల వార్తలు కోరుకుంటున్నాయి. అన్ని పత్రికలు ఇదే తీరును అనుసరించాలని కోరుకుంటున్నాయి. లిక్కర్‌ కేసుతో సంబంధం లేకపోయినా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇంటికొచ్చి పోలీసులు సోదాలు చేశారు. ఇలాంటి ఘటనలు పత్రికలకు, ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదు. పొలిటికల్‌ బాసులకు తలొగ్గి.. పోలీసులు, అధికారులు కూడా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు.

నవ్వితే కూడా తప్పా : విజయ్‌ బాబు, సీనియర్‌ సంపాదకులు

కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు నవ్వుతుంటారు. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడిరది. కానీ సుప్రీంకోర్టు సూచనలపైన కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే అత్యంత ప్రమాదకరం.

పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోంది : దిలీప్‌ రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు

రాజ్యం అధికార వ్యవస్థను ఉపయోగించుకుని అరెస్ట్‌ చేసింది. దీన్ని సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టింది. ఇందులో అంతర్గత విషయం ఏంటంటే.. పత్రికా స్వేచ్ఛను భంగం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సంఘటితంగా జర్నలిస్టులు తమ స్వేచ్ఛను రక్షించుకోవాలి.

తాజావార్తలు