హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ ప్రమాణం

` రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
` కార్యక్రమానికి సీఎం రేవంత్‌ తదితరుల హాజరు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ లో మధ్యాహ్నం 12:30 గంటలకు జస్టిస్‌ ఏకే సింగ్‌ తో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు తదితరులు హాజరయ్యారు. కాగా తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత జస్టిస్‌ ఏకే సింగ్‌ ఏడవ చీఫ్‌ జస్టిస్‌ గా నియమితులయ్యారు. త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన బదిలీపై తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ కోల్‌ కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ 1965 జులై 7న జన్మించారు. ఆయన ఢల్లీి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ బీ పట్టా పొందారు. 1990 నుంచి 2000 వరకు ఉత్తరప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. 2001 లో జార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2012 జనవరి 24న జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్‌ నుంచి జార్ఖండ్‌ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ- ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ గా 2022 నుంచి 2023 వరకు జార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2023 ఏప్రిల్‌ 17న త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నది పొందగా తాజాగా ఆయనను తెలంగాణ హైకోర్టుకు సీజేగా నియమిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.