పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 03 జనం సాక్షి :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారని కొనియాడారు. ఆనాటి దేశముఖ్ ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తు చేశారు. కొమురయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణాలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు దొడ్డి కొమురయ్య పోరు పటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహనీయుల కృషిని స్మరించుకునేందుకు, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అని ఉద్బోధించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల నాయకులు లక్ష్మణ్, దేవన్న, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, నరాల సుధాకర్, రాజేశ్వర్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.