తూర్పు కనుమల్లో అస్తమించిన రవి
` అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో గాజర్ల రవి మృతి
` ఆయనతో పాటు మరో ఇద్దరు కీలకనేతలు కూడా..
` మృతుల్లో అరుణ,అంజు ఉన్నట్లు గుర్తింపు
` గాజర్ల రవి మృతి ఎన్కౌంటర్తో సొంతూరు వెలిశాలలో విషాదం
` రవిపై రూ.25 లక్ష రివార్డు ప్రకటించిన ప్రభుత్వం
రంపచోడవరం(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదరుదెబ్బ తగిలింది. మరో అగ్రనేత హతమయ్యాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. దేవీపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరిలో ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య, స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడుయ గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2018లో డుంబ్రిగుడ సవిూపంలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. ఆమె స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఉదయ్పై రూ.25లక్షలు, అరుణపై రూ.20లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి మారేడుమిల్లి సీఐ, దేవీపట్నం ఎస్సై, పోలీసు సిబ్బంది బయల్దేరారు.
రవి మృతితో సొంతూరు వెలిశాలలో విషాదం
ఉత్తరాంధ్రలో జరిగిన ఎన్కౌంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వెళిశాలకు చెందిన గాజర్ల రవి మృతి చెందాడు. ఈ ఘటనతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడిరది. నాడు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల.. నేడు శోకసంద్రంలో మునిగింది. ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. గాజర్ల రవి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగారు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి అంచెలంచెలుగా ఎదిగారు. దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా ఉన్నారు. గాజర్ల రవిపై 25 లక్షల రివార్డు ఉంది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న వారిలో వెలిశాలలోని గాజర్ల కుటుంబం ఒకటి. కుటుంబంలోని అందరు కూడా అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. గాజర్ల కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ముద్రవేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మిగతా ముగ్గురు అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్.. 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉండి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. పోరుబాట వీడి కొంతకాలం పాటు విూడియాలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలోనే ఉన్న మరొకరే గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్. నాలుగు దశాబ్దాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఉన్నారు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కామ్రేడ్ గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు. ఎన్కౌంటర్ లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ పై 25 లక్షల రివార్డ్ ఉన్నది. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు.