తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురు యువకులకు గుండు గీయించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల వద్ద ఓ పెట్రోల్‌ బంక్‌ సిబ్బందితో ముగ్గురు యువకులకు ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ గొడవను నచ్చజెప్పాల్సిన పోలీసులు మాత్రం అతిగా ప్రవర్తించారు. ముగ్గురు యువకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై జగన్మోహన్‌ రెడ్డి.. వారికి వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ సమయంలో ఓ యువకుడు తల దువ్వుకోవడంతో ఎస్సై సీరియస్‌ అయ్యాడు. నా ముందే తలదువ్వకుంటావా అని వారిపై కోపంతో రెచ్చిపోయాడు. వెంటనే ముగ్గురు యువకులకు గుండు గీయించాడు.ఇలా అందరిముందు గుండు గీయించడంతో ముగ్గురు యువకులు మనోవేదనకు గురయ్యారు. వారిలో నితీశ్‌ అనే యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. తన పరువు పోయిందని భావించి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని నాగర్‌కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నితీశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తమ దురుసు ప్రవర్తన కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించినప్పటికీ ఎస్సై మాత్రం తన తీరును మార్చుకోలేదని సమాచారం. మిగతా ఇద్దరు యువకులను ఊరు విడిచి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.