అగ్రరాజ్యాధినేతల తలబిరుసు

శనివారం 26`2`2022
అగ్రరాజ్యాలు తలచుకుంటే ఏ దేశం విూదయినా దాడులు చేయవచ్చని తాజాగా ఉక్రెయిన్‌ యుద్దంతో మరోమారు తేలిపోయింది. సైనికపరంగా..ఆర్థికంగా బలంగా ఉంటే చాలని రష్యా, అమెరికాలు తేల్చేశాయి. ఇక అణు సామర్థ్యం ఉంటే అంతే సంగతులు. రేపు చైనా కూడా ఇదే నీతిని అవలంబిస్తుంది. పక్కనే ఉన్న తైవాన్‌ తమ భూభాగమే అని వాదిస్తోంది. భారత్‌లో ఉన్న అరుణాచల్‌ తమదే అంటోంది. టిబెట్‌ను అప్పనంగా ఆక్రమించుకుంది. విభజనతో గాయపడ్డ భారతదేశం కూడా సైనికంగా బలపడితే దేశ విభజన ఆధారంగా విడిపోయిన పాక్‌..బంగ్లాలపై యుద్దం చేసి వాటిని కలిపేసుకోవచ్చు… ఇలా చెప్పుకుంటూ పోతే ఏమైనా జరగవచ్చు. మధ్యయుగాల్లో దాడులతో ఆయా దేశాలను కబళించిన రాజ్యకాంఓ ఉన్న నేతల తరహాలోనే నిటి అగ్రరాజ్యాలు వ్యవహ రిస్తున్నాయనడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు. ఇలా సైనిక పాటవం ఉన్న దేశాలు ఇదిగో యుద్ధం అదిగో యుద్ధం అంటూ పరిస్థితులను వేడెక్కించవద్దని ఉక్రెయిన్‌ పాలకులు ప్రాధేయపడుతున్న తీరు చిన్న రాజ్యాల వేదనకు అద్దంª` పడుతోంది. ఇప్పుడు ప్రతి దేశం సైనికంగా బలపడాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలు సైనిక కూటమిగా ఏర్పడాలి. ఇతరదేశాల దాడులను తట్టుకునేందుకు సైనికంగా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే ఉక్రెయిన్‌లా లొంగగిపోక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం అత్యంత ప్రమాదకరపరిస్థితిలో ఉందని తాజా ఘటనలు రుజువు చేశాయి. గత ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అగ్రరాజ్యాలుగా ఎదిగిన అమెరికా, రష్యాలు దాడులకు తెగగబడుతూనే వచ్చాయి. అమెరికన్లు 1975లో వియత్నాం నుంచి నిష్కమ్రించారు. 28 సంవత్సరాల అనంతరం 2003లో ఇరాక్‌ను ఆక్రమించారు. సోవియట్‌ యూనియన్‌ సైన్యం 1989లో అఫ్ఘానిస్తాన్‌ నుంచి వెనక్కి వెళ్లిపోయింది. తరవాత తాలిబన్లను అణచివేసే క్రమంలో అమెరికా అఫ్గాన్‌లో పాగా వేసి చేయి కాల్చు కుంది. 33సంవత్సరాల అనంతరం రష్యా సైన్యం ఉక్రెయిన్‌ను దురాక్రమించింది. అమెరికా రష్యాల అగ్రరాజ్య అభిజాత్యాలకు సమస్త ప్రపంచమూ, ముఖ్యంగా వియత్నాం, అఫ్ఘానిస్తాన్‌, ఇరాక్‌, ఉక్రెయిన్‌లు భయానక మూల్యాన్ని చెల్లించుకుంటూనే ఉన్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అగ్రరాజ్యాలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. రష్యా, అమెరికాల సరసన ఇప్పుడు చైనా కూడా చేరబో తున్నది. తన ప్రతాపం చూపేందుకు అది అడపాదడపా యత్నిస్తూనే ఉంది. భారత్‌ వంటి పెద్ద దేశాన్ని కూడా అది భయపెడు తూనే ఉంది.ఇలా పొరుగు దేశం ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలి. అగ్రరాజ్యాలు గతంలో పాల్పడిన సైనిక దుస్సాహసాల గురించి ప్రపంచం ఇప్పుడు ఆలోచించాలి. వియత్నాం, ఇరాక్‌లో అమెరికాÑ అఫ్ఘానిస్తాన్‌లో సోవియట్‌ యూనియన్‌ ఇటువంటి దుస్సా హసాలకే పాల్పడ్డాయి. ఆ మూడు సైనిక జోక్యాలు అంతిమంగా విఫలమయ్యాయి. దురాక్రమించు కున్న దేశంలో ప్రజల జీవితాలను ఛిద్రం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పర్యవసానాలకు ఈ దురా క్రమణలు దారితీశాయి. 1965లో అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాంలో అమెరికా జోక్యంతో మొదల య్యింది. అయితే వియత్నాం అమెరికాను నిలువరించడంలో గట్టిగానే పోరాడిరది. క్యూబా విషయంలోనూ అమెరికాకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.1979 డిసెంబర్‌లో అఫ్ఘాని స్తాన్‌ను ఆనాటి సోవియట్‌ యూనియన్‌ ఆక్రమించుకుంది. అఫ్ఘాన్‌లో సోవియట్‌ యూనియన్‌ ఒక దశాబ్దం పాటు తిష్ఠవేసింది. అయితే రష్యాను వ్యతిరేకించే క్రమంలో అమెరికా తాలిబన్లను సృష్టించింది. విషాద మేమిటంటే సోవియట్‌ వ్యతిరేక పోరు మత ఛాందసవాదతత్వాన్ని సంతరించుకుంది. అంతర్యుద్ధం కారణంగా అఫ్ఘాన్‌ శిథిలం అయ్యింది. వియత్నాం నుంచి అమెరికా నిష్కమ్రించినట్టుగానే సోవియట్‌
అఫ్ఘాన్‌ నుంచి నిష్కమ్రించక తప్పలేదు. అఫ్ఘాన్‌ అనంతరం ఇరాక్‌ను దురాక్రమించేందుకు అమెరికా దాడులు చేసింది. ఇరాక్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనే కట్టుకథను అమెరికన్‌ పాలకులు ప్రచారం చేశారు. నిజానికి ఇరాక్‌ను దురాక్రమించుకోవడం అగ్రరాజ్య దురహంకార చర్య తప్ప మరోటి కాదు. అలా అక్కడి సద్దాం ప్రభుత్వాన్ని కూలదోయడమే గాకుండా అతడిని ఉరితీసే వరకు నాటి అధ్యక్షుడు బుష్‌ నిద్రపోలేదు. ఇలా జరిగిన ఘటనలన్నీ ఇప్పటికీ ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. వియత్నాం, ఇరాక్‌లు అమెరికాకు భౌగోళికంగా వేల కిలోవిూటరల్‌ దూరంలో ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్‌ సోవియట్‌ యూనియన్‌ సరిహద్దులకు సవిూపంలో ఉన్న దేశం. ఉక్రెయిన్‌, రష్యన్‌ ఫెడరేషన్‌కు పొరుగు దేశం. తాను ప్రపంచ ఏకైక అగ్ర రాజ్యాన్ని కనుక ఎక్కడైనా సరే ఎవరూ తన మాటను జవ దాటకూడదనే అహంకారమే ఇరాక్‌ ఆక్రమణకు అమెరికాను పురిగొల్పింది. వియత్నాం, అఫ్ఘాన్‌, ఇరాక్‌, ఉక్రెయిన్లలో అగ్రరాజ్యాల దాడులు అన్నీ అహంకారపూరితంగా సాగినవే అని చెప్పాలి. ఇరాక్‌లో జోక్యం చేసుకునేందుకు అమెరికా కు ఎలాంటి హక్కు లేదా బలమైన కారణం కూడా లేదు. అలాగే 1979లో అఫ్ఘాన్‌ను సోవియట్‌ యూనియ న్‌, ఇప్పుడు ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడం పూర్తిగా న్యాయవిరుద్ధం. అధికారంలో ఉన్న అమెరికా, రష్యా నేతల అహంకారమే అందుకు పురిగొల్పాయని భావించాలి. తమకంటే చిన్న వైన, సైనికంగా అంతగా శక్తిమంతం కాని దేశాలను ఆక్రమించుకోవడం తమ హక్కుగా అగ్రరాజ్యాలు భావించడం వల్లనే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఇప్పుడు ప్రపంచ దేశాలు చూడాల్సి వస్తోంది. ఒకప్పటి సోవియట్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్‌ ఇప్పుడిప్పుడే ప్రపంచ పటంలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకుంటోంది. ఉక్రెయిన్‌ సంక్షోభం పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు భవిష్యత్‌ గురించి ఆలోచించాలి. ఐక్యరాజ్య సమితి ఉత్సవ విగ్రహంలా మారింది. ఇలా దాడులు జరిగితే ఏం చేయాలో కూడా చర్చించాలి. లేకుంటే నేతల దురాక్రమణలకు ప్రజలు భారీగా మూల్చం చెల్లించుకోక తప్పడం లేదు.