అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే గణెళిశ్‌

గాలింపు చేపట్టిన పోలీసులు

బెంగళూరు,జనవరి23(జ‌నంసాక్షి): విజయనగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌పై మద్యం బాటిల్‌తో దాడి చేసిన కేసులో కంప్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గణెళిశ్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బిడది ఈగల్టన్‌ రిసార్టులో ఈ దాడి జరిగింది. నాలుగు సెక్షన్‌ల కింద బిడది పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో ఈగల్టన్‌ రిసార్టు నుంచి రెండు రోజులక్రితం బయటకు వచ్చిన గణెళిశ్‌ ఆచూకీ లేకుండా పోయింది. ఫోన్‌ స్విచ్చాఫ్‌ కాగా నియోజకవర్గానికి వెళ్ళలేదు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్‌ సింగ్‌ నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరించారు. ఇరువురి మధ్యా వాగ్వాదం కాస్త గొడవకు కారణమైందని దీంతో గణెళిశ్‌ హతమార్చేందుకు దూసుకొచ్చారని ఆనంద్‌సింగ్‌ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఆవేశంలో గన్‌మెన్‌ నుంచి తుపాకీ లాగేసుకునేందుకు వెళ్ళారని సాధ్యం కాకపోవడంతో గన్‌మెన్‌ చేయి కొరికారని ఆనంద్‌సింగ్‌ వివరించినట్లు తెలుస్తోంది. రామనగర్‌ డీఎస్పీ పురుషోత్తమ్‌, బిడది ఇన్‌స్పెక్టర్‌ హరీశ్‌ నేతృత్వంలో 3 బృందాలు గణెళిశ్‌ కోసం గాలింపులు సాగిస్తున్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.