అన్నదాతల ఆందోళనలకు ఏడాది

ఢల్లీి సరిహద్దుల్లో మార్మోగిన రైతునినాదాలు

మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌

న్యూఢల్లీి,నవంబర్‌26 (జనంసాక్షి):   కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢల్లీి సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దు చేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనను విరమించేది లేదని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. నిరసనకు ఒక సంవత్సరం సందర్భంగా ఢల్లీి సరిహద్దులో శుక్రవారం భారీ సభ నిర్వహించారు. ఢల్లీి చలో కార్యక్రమంలో వేలాదిసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర ఇచ్చేలా చట్టపరమైన హావిూతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు  రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేష్‌ టికాయత్‌ చెప్పారు. అయితే రైతుల ఆందోళనలతో దేశ రాజధానిలోని పలు సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు ఢల్లీి పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల్లో క్యాంపులు వేసి నిరసన కార్యక్రమాలు సాగిస్తున్నారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, లఖింపూర్‌ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేయనున్నట్లు రైతులు తెలిపారు.