అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రసిఎం జగన్‌ వైఖరిపై మండిపడ్డ రామకృష్ణ

గుంటూరు,నవంబర్‌16(జనం సాక్షి ): అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలన్న కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందని,  సీఎం జగన్‌ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా కలెక్టరేట్‌ వద్ద సీపీఐ చేపట్టిన దీక్షలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఉత్తరాంధ్ర, రాయలసీమలో పోటీ పాదయాత్రలకు వైసీపీ నేతలు సిద్దమయ్యారని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుందని… ఈ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని కోసం సుదీర్ఘమైన పోరాటంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు. రాజధాని మార్పుపై విచారణ జరిపే హైకోర్టు బెంచ్‌లో న్యాయమూర్తులను మార్చమనడం దిగజారుడుతనమే అని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొనాలని అమిత్‌ షా చెప్పినట్లు వార్తలొచ్చాయని తెలిపారు. ఈ డ్రామాలు మానుకోవాలని హితవుపలికారు. పీఎం, హోంమంత్రి రాజధాని మార్చవద్దని డైరెక్ట్‌గా సీఎంకు సలహా ఇవ్వాలని… అప్పుడు మాత్రమే ప్రజలు బీజేపీని నమ్ముతారని రామకృష్ణ పేర్కొన్నారు.