అమెరికా ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్‌ మహిళ

వాషిగ్టన్‌, నవంబర్‌8((జనంసాక్షి)) : అగ్రరాజ్యం అమెరికాలో హైదరాబాద్‌ మహిళ గజాలా హష్మీ చరిత్ర లిఖించారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో టెన్త్‌ సెనేట్‌ డిస్టిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున సెనేటర్‌గా గెలిచారు గజాలా. రిపబ్లికన్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ సెనేటర్‌ గెన్‌ సరెవాంట్‌ను గజాలా హష్మీ ఓడించారు. ఈ విజయంతో వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి మహిళా ముస్లిం-అమెరికన్‌గా, తొలి ఇండియన్‌-అమెరికన్‌గా హష్మీ రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట ఐజా ఉన్నత పాఠశాలలో చదువుకున్న గజాల, దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్లిపోయారు. జార్జియా వర్శిటీ నుంచి బీఏ ఇంగ్లిష్‌ అభ్యసించిన ఆమె అక్కడే పీహెచ్‌డీ కూడా చేశారు. హైదరాబాద్‌లో చదువుకునేటపుడు తోటి విద్యార్థులు అమెను ‘మున్నీ’ అని పిలిచేవారు. ఆమెకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమెరికాలోని పలు రాష్టాల్ర, స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతల్లో శ్వేతసౌధ మాజీ సాంకేతిక విధాన సలహాదారు సుహాస్‌ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆయన వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికవగా.. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌ కార్యాలయ సభ్యుడిగా మనో రాజు, ఉత్తర కరోలినా షార్లెంట్‌ మండలి సభ్యురాలిగా డింపుల్‌ అజ్మీరా గెలుపొందారు.