ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన ప్రధాని
– మండిపడ్డ రాహుల్
తిరువనంతపురం,అక్టోబర్ 4(జనంసాక్షి):భారత్ కు అతిపెద్ద బలమైన ఆర్థికవ్యవస్థను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం వయానాడ్ లో ఆయన పర్యటించారు. మోదీ హయాంలోనే దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఒకే పార్టీ ఒకే నాయకుడు, భిన్నత్వంలో ఏకత్వం అనే రెండు సిద్దాంతాల మధ్య పోరు జరుగుతోందన్నారు. ఇ సందర్భంగా బీజేపీ విధానాలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వర్గాల వారి కోసం పాటుపడుతుందని అన్నారు. అటు..ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు బనాయించి కటకటాల పాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు రాహుల్ గాంధీ. వీటన్నింటికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.