ఇంటర్ ఫలితాల గందరగోళంపై సిఎం స్పందించాలి
తక్షణం అధికారులను సస్పెండ్ చేయాలి
మంత్రి తోణం రాజీనామా చేయాలి
సిఎం కెసిఆర్కు రాజకీయాలు తప్ప ప్రజలు పట్టడం లేదు
సిఎం కెసిఆర్కు బహిరంగ లేఖ రాసిన ఉత్తమ్
హైదరాబాద్,ఏప్రిల్22(జనంసాక్షి): ఇంటర్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకుండా ఉండడం దారుణమని కాంగ్రెస్ ఆరోపించింది. విద్యార్థులు ఓ వైపు ఆందోళన చెందుతుంటే ఇంత మౌనంగా ఉండడంపై ఆందోలన వ్యక్తం చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు విక్రమార్క సిఎం కెసిఆర్కు లేఖ రాశారు. ఇంటర్ ఫలితాల ప్రకటనలో గందరగోళం ఏర్పడిన కారణంగా.. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్కు సోమవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు.బోర్డు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందని లేఖలో ప్రస్తావించారు. 10లక్షల మంది విద్యార్థుల ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఇంత కీలకమైన అంశంలో సీఎం కేసీఆర్ స్పందన శూన్యమని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి బోర్డు అధికారులతో కనీసం సవిూక్ష కూడా చేయలేదని ఆరోపించారు. వెంటనే బోర్డు అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించాలని లేఖలో డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రీకౌంటింగ్ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని సీఎంను కోరారు. కెసిఆర్కు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ధ్యాస తప్ప.. ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 9.45 లక్షల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని, ఫలితంగా 3 రోజుల్లో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో సబ్జెక్టుల మార్కులకు, మొత్తం మార్కులకు తేడాలున్నాయని వివరించారు. ప్రతి రోజు 40 పేపర్లు దిద్దాల్సిన లెక్చరర్లు 65 పేపర్లు దిద్దారని ఉత్తమ్ లేఖలో ఆరోపించారు. మంచి మార్కులు వచ్చే విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కని ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని సూచించారు.