ఈడీ చీఫ్‌ పదవీకాలం పెంపు


` కేంద్రం కీలక నిర్ణయం..
దిల్లీ,నవంబరు 17(జనంసాక్షి):ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో మరో ఏడాది వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 2022 నవంబర్‌ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఆయన ఈడీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్ల వరకూ (రెండేళ్ల ప్రాథమిక పదవీకాలం తర్వాత) పొడిగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చాక తొలిసారి ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు అవకాశాన్ని పొందిన అధికారిగా సంజయ్‌ కుమార్‌ మిశ్రా నిలవడం గమనార్హం.