ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
` దానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు
` జి7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన శత్రువని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలో జరిగిన జీ7 సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్ధించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా మోదీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలి. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మోదీ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంక్షోభాలతో ముందుగా దెబ్బతినేది వారేనన్నారు. గ్లోబల్ సౌత్లో నెలకొన్న ఆందోళనలు, ప్రాధాన్యతలను ప్రపంచ వేదికపై లేవనెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తోందన్నారు. ఇక, ప్రధాని డీప్ఫేక్ గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్న మోదీ.. ఏఐ జనరేటెడ్ కంటెంట్పై వాటర్ మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలన్నారు. ఈ శతాబ్దంలో సాంకేతికతపై పరస్పర సహకారం అవసరమన్నారు. కృత్రిమ మేధస్సు చుట్టూ ఉన్న ఆందోళనలను పరిష్కరించి, ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో సహా పలువురు ప్రపంచ నాయకులను కలిశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.