ఉగ్రవాది ఆసిఫ్ను మట్టుబెట్టాం
– జమ్మూకశ్మీర్ డీజీపీ సింగ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : జమ్మూకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో గత నెల రోజులుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఆసిఫ్ను మట్టుబెట్టామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ స్పష్టం చేశారు. బుధవారం డీజీపీ సింగ్ విలేకరులతో మాట్లాడారు. సోపోర్లో ఆసిఫ్ ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని, అంతే కాకుండా పౌరులను బెదిరించే విధంగా పోస్టర్లను అతికించడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. దుకాణాలను తెరవొద్దని, రోజువారీ పనులకు వెళ్లకుండా స్థానికులను ఆసిఫ్ బెదిరించాడని డీజీపీ చెప్పారు. ఆసిఫ్ కారులో వెళ్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో తమ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో పోలీసులపైకి ఆసిఫ్ గ్రెనేడ్లు విసరడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసిఫ్ కారును వెంబడించి పోలీసులు అతడిని హత్య చేశారని డీజీపీ స్పష్టం చేశారు. జమ్మూలోని పది జిల్లాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రశాంత
వాతావరణం నెలకొని ఉందని దిల్బాగ్ సింగ్ స్పష్టం చేశారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు తెరుచుకున్నాయని తెలిపారు. లేహ్, కార్గిల్లో కూడా ప్రశాంత వాతావరణం ఉందన్నారు. ఎక్కడ కూడా ఆంక్షలు లేవన్నారు. సమాచార వ్యవస్థ 100 శాతం పని చేస్తుందన్నారు డీజీపీ దిల్బాగ్ సింగ్.