ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగం

` చిక్కుకున్న 40మంది కార్మికులు..
` వేగంగా సాగుతున్న సహాయక చర్యలు
ఉత్తరకాశి(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. దాదాపు 40 మంది వరకు పనివాళ్లు ఇందులో చిక్కుకున్నారని తెలుస్తోంది. సొరంగంలో చిక్కుకున్న పనివాళ్లు అందరూ సురక్షితంగా ఉన్నారని, వాళ్లతో మాట్లాడేందుకు వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడిరచారు. సొరంగం కూలిన ప్రదేశం ఇరుగ్గా లేదని, అక్కడ వర్కర్స్‌ అటు ఇటు తిరిగేందుకు 400 మీటర్ల వరకు స్థలం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. యమునోత్రి జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న ఈ సొరంగం నిన్న ఉదయం కూలింది. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఒక్కరూ మాత్రమే ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. మిగిలిన వారందరూ హిమాచల్‌, బిహార్‌, అస్సాం, ఒడిశా, బెంగాల్‌కు చెందిన పనివాళ్లని గుర్తించారు. మరో వైపు టన్నెల్‌లో చిక్కుకున్న వారికి ఆక్సిజన్‌, మంచి నీరు సరఫరా చేసేందుకు ఒక పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. మరో పైప్‌లైన్‌ ద్వారా వారికి ఆహార పదార్థాలు కూడా అందిస్తున్నారు అధికారులు. అటు కూలిన శిధిలాలు తొలగించేందుకు భారీ యంత్రాలను తెప్పించారు. ఈ ఘటన తెలియగానే ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగం మొత్తం కదిలించి. పోలీసులు, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సహాయ చర్యలు చేపట్టాయి. పరిస్థితిని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లంతా సురక్షితంగా బయటపడతారని సీఎం ధామి ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్‌ ప్రారంభం నుంచి 200మీటర్ల వరకు సిమెంట్‌ చేసి చక్కగా ఉందని, కాని, ఆ తర్వాత పనులు సాగుతుండటంతో తవ్వకాలు జరిపే సమయంలో మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయని అధికారులు తెలిపారు. దీని వల్ల సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. ఏది ఏమైనా అందరికీ సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర అధికారులు తెలిపారు.టన్నెల్‌ ప్రవేశ ద్వారం నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం వర్కర్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.