ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు
ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లా, క్యాటగిరీలవారీగా ఖాళీల సేకరించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాథమిక వివరాలతో సర్కారుకు విద్యాశాఖ నివేదిక అందజేసిందని సమాచారం. డీఎస్సీ ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాద్యాయ ఖాళీలతో పాటు, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చంది. మరోవైపు సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం దిశగా కసరత్తును తీవ్రతరం చేసింది.
రాష్ట్రంలో మొత్తం 20,253 ఉపాధ్యా య ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ ప్రాథమికంగా తేల్చింది. అందులో 17,579 పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో, 2,930 పోస్టులు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ వంటి పోస్టులన్నీ కలిపి మరో 2,674 ఖాళీలు ఉండే అవకాశముందని విద్యాశాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
వచ్చే నెలలో టీచర్ల రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ లోగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్పై కూడా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. టీచర్ల ఖాళీల భర్తీకి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అడ్డు రాకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించకుండా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేస్తే.. ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వీసు రూల్స్ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు స్వీకరించడం, లేదా కోర్టుల నుంచి అనుమతి పొందడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి సర్వీసు రూల్స్కు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్లో ఉన్నది. దానిని కాదని ప్రభుత్వం సొంతంగా ఏ నిర్ణయం తీసుకొంటుందో అన్న అంశంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొత్తానికి అన్నీ సవ్యంగా జరిగితే మరో రెండు నెలల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉందని అధికారులు అంటున్నరు.