ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖకు నేవీ గుర్తింపు ?

విశాఖపట్నం,నవంబర్‌6 (జనంసాక్షి):   విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఇండియన్‌ నేవీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు నేవీ అధికారులు ఆహ్వానించారు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో వచ్చేనెల 4న జరగనున్న నేవీ డే వేడుకలకు రావాలని సీఎం జగన్‌ను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ ఆహ్వానించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరిట ముంబైలో నావికాదళ యుద్ధనౌక ఐఎస్‌ఎస్‌ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానుందని అజేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా అజేంద్ర బహదూర్‌సింగ్‌ను జగన్‌ సన్మానించి, శ్రీవారి ప్రతిమను అందజేశారు.