ఐడబ్ల్యూఏ అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్ ఎంపిక
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ) అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్ను ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో వచ్చే డిసెంబర్ ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న వాటర్ డెవలప్మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్, సైస్టెనబుల్ సొల్యూషన్స్లో తుది ప్రజెంటేషన్ను సమర్పించాలని ఎండీ దానకిశోర్కు ఐడబ్ల్యూఏ సెక్రటేరియట్ లేఖ ద్వారా కోరింది. ప్రపంచ వ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యూఏ డెవలప్మెంట్ అవార్డులను ప్రదానం చేస్తున్నది. సుమారు 130కి పైగా దేశాల నామినేషన్లతో పోటీపడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్కు జలమండలి ఎండీ ఎంపికయ్యారు. జల నాయకత్వం, జల సంరక్షణ(వాక్) కార్యక్రమం ద్వారా నీటి వృథాను తగ్గించడం, పునర్వినియోగం, బోర్లు రీచార్జి చేయడంపై దృష్టి సారించిన ఒక ప్రత్యేకమైన చొరవ, నీటి సంరక్షణ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న విషయాలను ఈ అవార్డు నామినేషన్స్ కోసం పంపడం జరిగిందని జలమండలి అధికారులు తెలిపారు.