ఒడిశాలో పడవ ప్రమాదం.. 

9మంది మృతి
భువనేశ్వర్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని
కేంద్రపడ జిల్లా నిప్పానియా వద్ద మహానది ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడగా ఈప్రమాదంలో 9 మంది మృతి చెందారు.ఒడిశాలోని పర్యాటక  ప్రాంతం హుక్కితలకు ప్రయాణికులతో వెళ్లి తిరిగి వస్తున్న ఓ నాటు పడవ బుధవారం రాత్రి కేంద్రపడ జిల్లా నిప్పానియా వద్ద మహానది ముఖద్వారం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా కుజంగా వాసులుగా పోలీసులు గుర్తించారు. నిప్పానియా గ్రామం వద్ద పడవ దిగే సమయంలో అందరూ ఒకవైపుకు  రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో పడవలో 55 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ రూ. 4లక్షల చొప్పున పరిహారం
ప్రకటించారు.