కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్24 జనం సాక్షి : ఉల్లిపాయ ధరలు ప్రజలకు కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు పెరిగి పోవడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ. 80 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయలను రూ. 40 నుంచి రూ.50లకు అమ్ముతున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఢిల్లీలో ఉల్లిపాయలను కేంద్ర ప్రభుత్వమే విక్రయిస్తోంది. కేంద్రం ఢిల్లీలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలను రూ. 22కే అమ్ముతోంది. దీంతో ఉల్లిపాయ విక్రయ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఢిల్లీ మార్కెట్లో అయితే కిలో ఉల్లిపాయల ధర రూ. 75 నుంచి రూ. 80గా ఉంది.
బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్లో అయితే కిలో ఉల్లిపాయల ధర రూ. 60గా ఉంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు తగ్గింది. దీంతో ఉల్లి సరఫరాకు డిమాండ్ పెరిగింది. ఇలాగే వర్షాలు కురిస్తే ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బీహార్లో రూ. 8 లక్షల ఖరీదు చేసే ఉల్లిపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మహారాష్ట్రలో రూ. లక్ష ఖరీదు చేసే ఉల్లిపాయలను దొంగిలించినట్లు కేసు నమోదైంది.