కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం

మాదీ ఒంటరి పోరే అన్న ఆమ్‌ ఆద్మీ

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్‌ సీనియర్‌ నేత, పార్టీ దిల్లీ యూనిట్‌ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అనే విషాన్ని మింగేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, కాంగ్రెస్‌ ఇప్పటికీ అహంభావంతో ఉంది. అందుకే మేం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. దిల్లీ, పంజాబ్‌, హరియాణాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’ అని గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. త్వరలోనే లోక్‌సభలో పోటీ చేసే ఆప్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అటు కాంగ్రెస్‌ కూడా ఆమ్‌ ఆద్మీతో పొత్తుకు అంతగా ఆసక్తి కనబర్చట్లేదు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ దిల్లీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షీలా దీక్షిత్‌ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విషయమై ఆమ్‌ ఆద్మీ పార్టీతో చర్చించలేదని స్పష్టం చేశారు. రాజకీయాలంటేనే సవాళ్లనీ, తమకు భాజపా-ఆమ్‌ఆద్మీ పార్టీ ఒక సవాల్‌ అని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కొంటామని చెప్పారు.