కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట

నదీతీరాల్లో పుణ్యస్నానాలు

ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ

శివాలయాల్లో రుద్రాభిషేకాలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు

హైదరాబాద్‌,నవంబర్‌25((జనంసాక్షి)): తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో అభిషేకాలు చేపట్టారు. పుణ్యతీర్థాల్లో నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసిన భక్తులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలుచేశారు. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో మహిళలు పూజలు నిర్వహించారు. పంచరామక్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4గంటలకే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పవిత్ర స్నానాలు చేసిన మహిళలు శివాలయంలో పెద్ద ఎత్తున్న వత్తులు వెలిగించే కార్యక్రమం చేశారు. పలుచోట్ల గోమాతలకు పూజలు చేశారు. కార్తీకం చివరి సోమవారం కావడంతో భక్తులు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు చేశారు. ప్రజలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం,మహానంది, పంచారామాలు, కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గ, శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుడిని ప్రార్థించారు. అమరావతి, కోటప్పకొండ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలో కృష్ణాతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ప్రాచీన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయం, కాళేశ్వరం,కీసర, ధర్మపురి, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి,రామప్ప ఆలయం, కొడవటూరు ఆలయాలకు భక్తుల పోటెత్తారు. నల్లగొండ ఛాయా మహేశ్వరాలంలో భక్తులు పోటెత్తారు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాసరలో ప్రత్యేక పూజలకు తరలివచ్చారు. ఉదయాన్ని పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో జరిగే పుణ్యస్నానాలను పురస్కరించుకొని ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి స్నానాలు ఆచరించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఇటు వెములవాడ, అటు శ్రీశైల పుణ్య క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. వేములవాడ రాజన్న ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీకమాసం చివరి సోమవారం, మాస శివరాత్రి సందర్భంగా.. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు

ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి.. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అచ్చంపేట కన్యక పరమేశ్వరీ, ఉమా మహేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైల పుణ్య క్షేత్రానికి కుటుంబంతో సహా వచ్చిన భక్తులు కార్తీక దీపారాధన లో పాల్గొన్నారు. దర్శనం క్యూ లైన్లలో కిలోవిూటరువరకు భక్తులు నిలపడిఉన్నారు. ఉదయం 3 గంటలకు మంగళవాయిద్యాలు, సుప్రభాతం జరుగగా? 4 గంటల నుండే పరమేశ్వరుని దర్శణానికి భక్తులను అనుమతించారు. గుడి ప్రాంగణంలోవున్న గంగమ్మ ఒడిలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు విడిచి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. స్వామివారిని దర్శించడానికి 6 గంటలకు పైగా సమయం పడుతుండటంతో దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్న వారికి పాలు.. మజ్జిగ ప్రసాదాలు అందజేస్తున్నారు గుడి సిబ్బంది. ఇకపోతేనగరంలోని శివాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. మణికొండలోని రామాలింగేశ్వరస్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూకట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉసిరిచెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.