కాలు దువ్వాయి!


– కోడి పెందేలతో సందడిగా మారిన పల్లెలు
– ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు
– పట్టణాల నుంచి భారీగా తరలివెళ్లిన పందెం రాయుళ్లు
– కోట్లలో బెట్టింగులతో హడావిడి
– పోలీసుల హెచ్చరికలు భేఖాతర్‌
కికానాడ, జనవరి14(జ‌నంసాక్షి) : సంక్రాంతి వచ్చిందంటే చాలు.. వెంటనే గుర్తుకొచ్చేంది కోడిపందేలు.. అనాదికాలంగా వస్తున్న ఈకోడి పందేలు ప్రధాన ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగాసాగుతుంటాయి.. వీటిని తిలకించేందుకు ప్రజలు.. బెట్టింగ్‌లు కాసేందుకు బెట్టింగ్‌ రాయుళ్లు పట్టణాలు, పల్లెల నుంచి భారీగా తరలివెళ్తారు.. ముఖ్యంగా భీమవరం కోడి పందేల పెట్టింది పేరు.. ఇక్కడి కోడి పందేలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివస్తుంటారు.. ప్రతీ యేడాదిలాగానే ఈ ఏడాది కోడి పందేలు జోరుగా సాతున్నాయి.. పలు ప్రాంతాల్లో సాంప్రదాయ రీతిలో కోడిపందేలు జరుగుతుండగా.. సందట్లో సడేమియాగా బెట్టింగ్‌ రాయుళ్లు కోడి పెందేలను ఉపయోగించుకొని కోట్లలో బెట్టింగ్‌లు నడుపుతుంటారు.. పోలీసుల హెచ్చరికలనుసైతం లెక్కచేయక బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు..
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. వేల నుంచి లక్షల్లో పందేలు కాస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సోమవారం తెల్లవారుజామునే మంటలు వేసి భోగికి స్వాగతం పలికిన ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, కొత్తబట్టలు, పిండి వంటలు, ఎడ్ల పందేలేనా?. అవే కాదు అసలైనవి మరొకటి ఉంది.. అవే కోడి పందేలు. సంక్రాంతి వస్తుందంటే నెల రోజుల ముందు నుంచి గోదావరి జిల్లాలో సందడి మొదలైపోతుంది. ముఖ్యంగా పందేల కోసం కోళ్లను సిద్ధం చేసుకుంటారు పందెం రాయుళ్లు. సంక్రాంతి పండుగ వచ్చేయడంతో ఇక కోళ్ల పందేలకు తెరదీశారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా భారీస్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు.  ఎప్పటిలాగానే
కోడి పందేలకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. కోడి పందేలతో గతేడాది ఏకంగా వేయి కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలకు పందేలు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కోడి పందేలపై చూసీచూడనట్లు వ్యవహరించాలని ప్రజాప్రతినిధుల నుంచి పోలీసులకు ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ పందేలు చూడటానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో గోదావరి జిల్లాలకు తరలివస్తున్నారు. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేలు విస్తరించాయి. ఈసారి ఒక్కో జిల్లాలో భారీ పందేలు వేసేలా 10-15 బరులు, చిన్న పందేలు వేసుకునేలా 500-600 బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. చిన్న బరుల్లో రూ.5వేల నుంచి లక్ష రూపాయల వరకు, పెద్ద బరుల్లో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పందేలు కడుతున్నారు. దీనికి తోడు కోడి పందేల పక్కనే గుండాట, పేకాట, కోతాటలు కూడా నిర్వహిస్తుండటంతో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి.
భద్రాద్రి జిల్లాలో..
ఏపీకి సరిహద్దు జిల్లా అయిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలోని అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో కోడిపెందేలను భారీగా నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట ఏరియాల్లో డిసెంబర్‌ నుంచే అడపాదడపా ఈ పందేలు నడుస్తున్నాయి.. కాగా ఈ ప్రాంతాల్లో మామిడి తోటలను బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ కోడి పందేల్లో బెట్టింగ్‌లు కాసేందుకు ఖమ్మం జిల్లాతో పాటు, ఇతర తెలంగాణ జిల్లాల నుంచి బెట్టింగ్‌ రాయుళ్లు తరలివెళ్లారు.. కోడిపందేలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా నిర్వాహకులు వీటిని పట్టించుకోకుండా రహస్య ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. పందేలతో పాటు సందట్లో సడేమియాగా జూదం, పేకాట తదితర ఆటలను రహస్యంగానిర్వహిస్తూ బెట్టింగ్‌లు కాస్తూ బెట్టింగ్‌ రాయుళ్లు సందడి చేస్తున్నారు.