కేరళలో వర్ష బీభత్సం..


` 21కి చేరిన మృతుల సంఖ్య
` సీఎం పినరయితో మాట్లాడిన ప్రధాని
తిరువనంతపురం,అక్టోబరు 17(జనంసాక్షి): కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందినవారి సంఖ్య 21కి చేరింది. మరణించినవారిలో 13 మంది కొట్టాయంకు చెందినవారు కాగా 8 మంది ఇడుక్కి జిల్లాకు చెందినవారు. మరికొంతమంది గల్లంతయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కొట్టాయం జిల్లా కలెక్టర్‌ పీకే జయశ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. ఈ రాత్రికి మళ్లీ భారీ వర్షం కురిస్తే మళ్లీ సమస్యలు పెరగవచ్చునని పేర్కొన్నారు.అయితే, భారీ వర్షాల ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకల కారణంగా వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్రివిధ దళాల సిబ్బంది, జాతీయ విపత్తుల స్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సీఎం పినరయి విజయన్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పినరయితో మాట్లాడిన ప్రధాని
కేరళలో మృతులపట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో చర్చించారు. ‘కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడాను. వరదలు, కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు, బాధితుల సహాయార్థం అధికారులు పలు సహాహక చర్యలు చేపడుతున్నారు. ప్రతిఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.