కేరళ గవర్నర్‌గా అరిఫ్‌ ప్రమాణం

– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
– పాల్గొన్న కేరళ సీఎం, మంత్రులు
తిరువనంతపురం, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  కేరళ కొత్త గవర్నర్‌గా అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్‌గా అరిఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. అరిఫ్‌ చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్‌, మంత్రులు, రాజ్‌భవన్‌ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివం స్థానంలో ఖాన్‌ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ సదాశివం పదవీకాలం పూర్తవడంతో.. ఆయన స్థానంలో ఖాన్‌ ను కేంద్రం నియమించింది. రిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ది అరుదైన వ్యక్తిత్వం. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన, ముస్లిం చట్టాల్లో మార్పులు అవసరమని గట్టిగా చెప్పేవారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చట్టంపై ప్రధాని మోదీకి మద్దతిచ్చి వార్తల్లో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు
చెందిన ఖాన్‌, లౌకిక పార్టీలతో ముస్లింలకే నష్టమని బలంగా నమ్మే వ్యక్తి. విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, 26వ ఏట యూపీ శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 1980, 84లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర క్యాబినెట్‌ నుంచి వైదొలిగిన ఖాన్‌.. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత జనతాదళ్‌, బీఎస్పీలో చేరారు. 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2007వరకు క్రియారహితంగానే ఉన్నారు. పార్టీలో గుర్తింపు లభించకపోవడంపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తిం చేసిన ఆరిఫ్‌కు అనూహ్యంగా గవర్నర్‌ పదవి వరించింది.